పవన్ విజ్ఞతతో ఆలోచన చేయడం లేదు.. చెప్పుడు మాటలకే ప్రాధాన్యత : వర్ల రామయ్య

సోమవారం, 8 మే 2017 (13:51 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ విజ్ఞతతో ఆలోచన చేయడంలేదనీ, చెప్పుడు మాటలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
తితిదే కొత్త ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించడం ఇపుడు వివాదాస్పదమైంది. దీనిపై రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి ఆజ్యం పోసేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. 
 
వీటిపై వర్ల రామయ్య స్పందించారు. ఇదే అంశంపై ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ఉత్తరాది, దక్షిణాది అని విభజించవద్దని హితవు పలికారు. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో తమకు మద్దతిచ్చాడని, అయినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడితే సరిచేయకుండా ఉండలేమన్నారు. 
 
తితిదే ఈవోగా దక్షిణ భారతీయులకు మాత్రమే అని ఎక్కడైనా చట్టంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అనిల్ కుమార్ సింఘాల్ సమర్థుడైన ఆఫీసర్ అని కితాబిచ్చారు. ఆయన సరిగా పని చేయకపోతే ఎప్పుడైనా ఆయనను తొలగించవచ్చన్నారు. అది మన చేతుల్లోనే ఉన్న వ్యవహారమని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి