2021 బడ్జెట్ ద్వారా ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు : కేంద్రమంత్రి జయశంకర్

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (20:25 IST)
ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు అందించేలా 2021 కేంద్ర బడ్జెట్ రూపొందించడం జరిగిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్ పేర్కొన్నారు. కోవిడ్‌ ముప్పును వేగంగా గుర్తించడంతో పాటు దానిని సమర్ధంగా ఎదుర్కొని, ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారన్నారు.

భాజ‌పా విజ‌య‌వాడ పార్ల‌మెంట్ జిల్లా ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజ‌య‌వాడ‌లో కేంద్ర బ‌డ్జెట్‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం కేంద్ర మంత్రి జ‌య‌శంక‌ర్ మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌లో కుధేలైన భారత ఆర్థిక రంగాన్ని ఆదుకునేలా ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమం అమలుచేసి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రోత్సహకాలు, ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఆహారధాన్యాలు అందచేశారన్నారు.

నేడు కోవిడ్‌ను జయించిన దేశంగా భారత్ ప్రపంచ దేశాలతో ప్రశంసలు అందుకుంటోందన్నారు. వైద్య రంగానికి, ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొన్న దేశానికి జవసత్వాలు అందించేలా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించామన్నారు.  మోదీ ప్రభుత్వం తీసుకున్న మందస్తు రక్షణాత్మక చర్యలతో కోవిద్ రికవరీ ప్రపంచంలోనే ప్రథమస్థాయిలో ఉంది.

కరోనా వల్ల కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దే చర్యల్లో భాగంగానే 2021 కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడం జరిగింది. ఆర్ధిక వ్యవస్థకు ఇది జవసత్వాలు అందిస్తుంది. గత ఏడాది కోవిద్ వ్యాపించినపుడు దేశంలో దీనిపై ఎవరికి అవగాహన లేదు. పీపీఈకిట్లు, వెంటలేటర్లు, మాస్కులు ఇతర వైద్యరక్షణ పరికరాలు అందుబాటులో లేవు.

మాస్కులు, శానిటైజర్లు మాత్రం పరిమితంగా ఉత్పత్తి అయ్యేవి. కోవిడ్ కోసం ప్రత్యేకించిన ఆసుపత్రులు లేవు. ప్రధాని మోదీ పరిస్థితిని గమనించి కోవిడ్‌ను ఎదుర్కొనే ముందస్తు రక్షణాత్మక చర్యలు చేపట్టారు. 16 వేల కోవిడ్‌ సెంటర్లు, వెంటిలేటర్లు తయారుచేసే కంపెనీలు 25కు పెరిగాయి. వేలకొద్దీ సంస్థలు పీపీఈ, మాస్కులు తయారుచేస్తున్నాయి. స్థానిక వినియోగానికే కాక విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

విదేశాల అభ్యర్ధన మేరకు హైడ్రాక్సీ క్లోరోక్లిన్, పారాసిటమాల్ తో పాటు 150 దేశాలకు మందులను ఎగుమతి చేశాం. కోవిదన్ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు భారత్ చేపట్టింది. ఇతర దేశాలు కోవిడ్‌కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టినా మరల అక్కడ కోవిడ్‌ వస్తోంది. కాని ఇందుకు భిన్నంగా దేశంలో కోవిడ్‌ ఇప్పుడు నియంత్రణలో ఉంది.

ప్రజలు కూడా స్పందించి ప్రభుత్వ చర్యలకు సహకారం అందించారు. ప్రధాని మోదీ చేపట్టిన ముందస్తు జాగ్రత్తలే కారణం. సమయస్పూర్తిగా స్పందించి లాక్‌డౌన్ విధించి, అన్ని వర్గాలకు ఆత్మవిశ్వాసం కల్పించి స్వయం సమృద్ధి లభించేలా ఆత్మ నిర్బర్ భారత్ పథకాన్ని అమలుచేశార‌ని తెలిపారు. 

రాజ్య‌స‌భ స‌భ్యులు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు మాట్లాడుతూ ఏపిలో రెండు పార్టీలు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వైసిపి, టిడిపి లు ఒకే బాటలో‌ బడ్జెట్ ను విమర్శిస్తున్నాయి. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మా పై బురద చల్లుతున్నారు.

నోటా పార్టీ అంటారే గానీ... బిజెపి ని‌చూస్తే వారి నోట మాట రావడం లేదు. పంచాయతీ, తిరుపతి ఎన్నికల భయం వారిలో కనిపిస్తుంది. రూ.2 లక్షల 34వేల కోట్లు ఏపికి వచ్చే ఐదేళ్లలో రానున్నాయి. ఐదు పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చెందబోతున్నాయి. అసలు‌ వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయం చేయడమే వైసిపి, టిడిపిల పని.

రాజకీయ దుష్ప్రచారం ఎక్కువ కాలం నిలవదు. గతంలో టిడిపి అలా‌చేసి దెబ్బతిన్నట్లుగా ‌వైసిపి కూడా చావు దెబ్బ తింటుంది. బిజెపి అధికారం సాధిస్తుందనే భయంతో ఆ రెండు పార్టీ లు ఒకే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నాయి. విద్యా వంతులు, మేధావులు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజకీయ లబ్ది, ఆర్ధిక లబ్ది కోసమే ఆ రెండు పార్టీ లు పని‌ చేస్తున్నాయి అని పేర్కొన్నారు. 

భాజ‌‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అప్పులను తీర్చడానికి నిర్మాణాత్మక వ్యవస్థను మోడీ అమలు చేస్తున్నారు. అమరావతి ఏపి రాజధానిగా ఉండాలని అందరూ భావించారు.

దుర్గగుడి ఫ్లైఓవర్, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌లు పూర్తి చేశాం. కృష్ణా నదిపై మరో రెండు వంతెనల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. ఆరు, నాలుగు రోడ్ల జాతీయ రహదారుల‌ అభివృద్ధి చేశాం. మోడీ విజయవాడ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.

రైల్వే బడ్జెట్‌లో రూ.5,600 కోట్లు ఏపికి కేటాయించారు. రెండు లైన్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మూడో లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్షా 13వేల 900కోట్ల రూపాయలు కేంద్రం ఏపికి‌ వివిధ రూపాల్లో ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న‌ ఇళ్ల నిర్మాణం మోదీ ఇచ్చిన నిధులతో చేస్తున్నారు.

మోదీ‌ ఎపికి ఎంతో చేస్తున్నా అవి తమ గొప్పగా టిడిపి, వైసిపి నేతలు ప్రచారం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇ‌న్‌ఛార్జి సునిల్ డియోధర్‌, పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు