తెదేపా పని అయిపోయిందనుకున్నా ... గంటా శ్రీనివాసరావు

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:16 IST)
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అనుకున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు వచ్చి పార్టీలో చేరడం శుభపరిణామం అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన దాదాపు 300 మందికి పైగా కార్యకర్తలు, నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ, పార్టీ పని అయిపోయిందని భావిస్తున్న సమయంలో బీజేపీ నుంచి 300 మంది టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు జరిగి పార్టీ మరింత బలపడాలని ఆశిస్తున్నానని అన్నారు. ప్రస్తుత చేరికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు. 
 
ఈనెల 19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని గంటా తెలిపారు. అయితే తాము టార్గెట్ చేసి ఎవరినీ పార్టీలోకి చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలుంటాయని ఆయన వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు