సీఎం పాలనపై అసంతృప్తిగా వున్నారా? ఐతే ఫోన్ కట్, ఓటు ఫట్... ఎవరు?

మంగళవారం, 9 అక్టోబరు 2018 (17:32 IST)
మనకు ఓటు వేసే వాడైతే వాడెంత దూరంలో ఉన్నా రప్పించుకోవాలి... మనకు వేయని వాడైతే, వాడిని ఎంత దగ్గరగా ఉన్నా... పోలింగ్ బూత్ వైపు రానియ్యొద్దు... ఇవి ఒక పాత తెలుగు సినిమాలో రాజకీయ నాయకుడి పాత్ర తన కొడుకు పాత్రతో చెప్పే డైలాగ్. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న హవా కూడా ఇదేవిధంగా ఉందనేది మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తాజాగా చేసిన ఆరోపణ.
 
సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నివశిస్తున్న వారికైనా లేదా బ్రతుకుతెరువు కోసం మరేదైనా రాష్ట్రానికి వెళ్లిన వారికైనా ఓటరు మహాశయులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంతో వచ్చే ఫీడ్‌బ్యాక్ కాల్ ఒకటి వస్తూనే ఉంటుంది. ఈ కాల్ రోజుకి ఒక్కసారి నుండి ఒక్కో రోజు నాలుగైదు సార్లు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అందరికీ సాధారణంగా అనిపిస్తూంటుంది. 
 
మరి కొందరైతే.. ఒక అడుగు ముందుకేసి తన పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చంద్రబాబు చేస్తున్న గొప్ప ప్రయత్నమని కూడా కితాబిచ్చేస్తున్నారు. కానీ దీని వెనుక అసలు కారణం వేరనే మాట తాజాగా ఐవైఆర్ గారి ఉవాచ. ఈ కాల్‌లకు రెస్పాండయ్యే తీరుని బట్టి, ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బట్టి సదరు వ్యక్తి ఓటు ఎవరికి పడుతుందనే అంచనాతో ఓటు వేసే ఉద్దేశ్యం లేని వ్యక్తి పేరుని ఓటరు లిస్ట్ నుండి లేపేసే కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 లక్షల ఓట్లు జాబితాలో నుండి ఎగిరిపోయాయని ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు ఇటీవల చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం వెనుక ఈ కాల్ పాత్ర ఉందనేది ఆయన వాదన.
 
"ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తుంది. పాలనపై సంతృప్తిగా ఉన్నారా? లేకపోతే అసంతృప్తితో ఉన్నారా? అంటూ అడుగుతారు. ఎవరైనా అసంతృప్తిగా ఉన్నాము అంటే వెంటనే ఫోన్ కట్ చేస్తారు. ఎందుకైనా మంచిదని కొన్ని రోజుల తర్వాత ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చూసుకోండి" అంటూ ఐవైఆర్ ట్విటర్లో ప్రజలకు సలహా ఇచ్చారు. మరి మీ ఓటు ఉందో లేదో మీరు కూడా చూసేసుకోండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు