కేసీఆర్ గుండెల్లో గుబులు.. పెనువివాదంగా మారిన ఓటర్ల పేర్లు గల్లంతు

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (15:37 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసెంబ్లీ కాలపరిమితి మరికొన్ని నెలలు ఉన్నప్పటికీ ఆయన ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు కాగా, ఆపబద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతూ, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
 
ఈనేపథ్యంలో ఓటరు జాబితాలో పేర్ల గల్లంతు పెనువివాదం కాబోతుంది. ఇది ముందస్తు ఎన్నికలకు ఆటంకంగా పరిణమిస్తుంది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారినట్లు అటూఇటూ తిరిగి సుప్రీంకోర్టుకు చేరింది. అవకతవకలు ఉన్నాయని కోర్టు భావించినపక్షంలో జనవరి 2019లోగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఇదే విషయంపైన అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. 
 
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఓటరు జాబితాలో అవకతవకలపైన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. తెలంగాణలో సుమారు 70 లక్షల ఓటర్లకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయని, అందువల్ల కుదించిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసి, ముందుగా జారీ చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని కొనసాగించేలా ఆదేశించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. 
 
తెలంగాణలో జనవరి 1, 2019వ తేదీ ప్రామాణికంగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, దానిని రద్దు చేస్తూ 2018 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా స్వల్పకాలిక ఓటరు నమోదు షెడ్యూలును జారీ చేసిందని, నాలుగు నెలల కాలంలో సరిదిద్దాల్సిన ఓటరు జాబితాను నాలుగు వారాలకు కుదించిందని, ఈ సమయం సరిపోదని శశిధర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని మొదటి ప్రతివాదిగా చేర్చారు. 
 
ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నిలకు కాంగ్రెస్ అడ్డుపడుతుందని ఆది నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. గురువారం పలువురు సీనియర్ నేతలు సైతం ముందస్తు ఎన్నికలపై మబ్బులు కమ్ముకుంటున్నాయని వ్యాఖ్యానించారుకూడా. అదేసమయంలో ఫాంహౌజ్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందించనుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం జనవరిలోగా ఎన్నికలు జరగడానికి అవకాశాలు లేవని ఘంటాపథంగా చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు