మేము దొంగలం, అరిస్తే చంపేస్తాం... కామెడీ కాదు నిజం అంటూ రూ. 35 లక్షల దోపిడీ

బుధవారం, 2 డిశెంబరు 2020 (20:37 IST)
రాజా ది గ్రేట్.. ఈ సినిమాలో రవితేజకు కళ్లు కనిపించవు. రాజేంద్రప్రసాద్‌కు అప్పులు ఎక్కువగా ఉంటే ఆ అప్పును తీర్చడానికి బ్యాంకు దొంగతనానికి ప్లాన్ చేస్తాడు రవితేజ. రాజేంద్రప్రసాద్, కమెడియన్ శ్రీనివాసులరెడ్డి ఇలా బ్యాంకు దొంగతనానికి వెళతారు. వారి వేషం చూసి బ్యాంకు మేనేజర్ ఫృధ్వీ మీరు ఎవరు అంటే.. మేము దొంగలం.. మర్యాదగా డబ్బులు ఇవ్వండి.. ఇవి బొమ్మ తుపాకులు కావు. నిజమైన తుపాకులు అంటూ వారిని భయపెడుతారు. 
 
ఇదంతా సినిమాలో కానీ.. నిజంగా కూడా అలాంటి ఘటన తిరుపతిలో జరిగింది. సినీ ఫక్కీలో కామెడీగా జరిగిన చోరీలో దొంగలు ఏకంగా 35 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, 2 లక్షల రూపాయలకు పైగా నగదును ఎత్తుకెళ్ళారు. 
 
తిరుపతి బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీకి చెందిన నాగరాజు ఫర్నిచర్ షాపు నడుపుతున్నాడు. బాగా ఫేమస్ ఫర్నిచర్ షాపు తిరుపతిలో ఉంది. నిన్న రాత్రి ఫర్నిచర్ షాపులో పనిచేసే వారు ఇంటిలోకి పనులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి నాగరాజు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు.
 
ఇంటి ముందు ఉన్న డోర్ నుంచి కాకుండా లిఫ్ట్ ముందు గేట్‌ను గడ్డపారలతో తొలగించి లిఫ్ట్ ద్వారా 5వ అంతస్తులోకి వచ్చారు. ఆ తరువాత ఇంటి పక్కనే ఉన్న గ్లాస్‌ను పగులగొట్టారు. లోపలికి ప్రవేశించారు. గట్టిగా శబ్ధం రావడంతో నాగరాజు తన గది నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో దొంగలు మా చేతిలో ఉన్నది పదునైన కత్తి, పొడిస్తే చచ్చిపోతావ్.. మేము కామెడీ చేయడం లేదు. మర్యాదగా డబ్బులు ఇవ్వు. 
 
డబ్బులు, నగలు ఎక్కడ పెట్టావు అంటూ నాగరాజును బెదిరించారు. గట్టిగా అరిస్తే చంపేస్తామని మూలన కూర్చోబెట్టి బీరువా తాళాలను నాగరాజు దగ్గరే తీసుకుని బీరువాలో ఉన్న 600 గ్రాములు.. సుమారు 35 లక్షలకు పైగా విలువ చేసే బంగారం, 2లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్ళారు. దొంగలు లోపలికి ప్రవేశించే సమయంలో సి.సి. కెమెరాలను ధ్వంసం చేశారు. కానీ ఇంటికి ఎదురుగా ఉన్న సి.సి.కెమెరాల్లో మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. నిందితులు పాత నేరస్తులుగానే గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు