బావా... నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధపడాలి... క్షమించు...

ఆదివారం, 30 జూన్ 2019 (13:56 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. బాబా నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధపడాలి అంటూ పలకపై రాసిపెట్టి పంట కాల్వలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అభం, శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. 
 
స్థానికంగా సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన కారింకి శ్రీను అనే వ్యక్తి కొబ్బరి దింపుడు కార్మికుడుగా జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు మేనమామ కూతురైన మండపేటకు చెందిన నవీన(25)తో కొన్నేళ్ల క్రితం వివాహంకాగా, ఈ దంపతులకు రాజేష్‌(7), కుమార్తె నిత్యనందిని(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, ఈ దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు విభేదాలు తలెత్తాయి. దీంతో నవీన తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై తీవ్ర మనస్తాపంతో ఉన్న నవీన శనివారం ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బస్సులో బయలుదేరింది. కానీ మనసు మార్చుకుని మధ్యలోనే దింగేసింది. ఆ తర్వాత లొల్ల లాకుల పంటకాలువ వద్దకు చేరుకుని పిల్లాడి స్కూల్‌ బ్యాగ్‌లో పలకపై 'నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధపడాలి... బావా నన్ను క్షమించండి..' అని పలకపై రాసి పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరిన నవీన మధ్యలోనే మనస్సు మార్చుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటల సమయంలో మృతదేహాలను వెలికితీశారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు