ఏ గుర్తుకు ఓటు వేస్తావన్న మంత్రి ధర్మాన.. సైకిల్ గుర్తుకు ఓటేస్తానని చెప్పిన మహిళ...!

బుధవారం, 12 జులై 2023 (10:59 IST)
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు ఓ వింత పరిస్థితి ఎదురైంది. ఓ గుర్తుకు ఓటు వేస్తావని ఒక మహిళను మంత్రి ధర్మాన ప్రశ్నించారు. దీనికి ఆమె.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేస్తామని సమాధానం చెప్పింది. దీంతో మంత్రి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న వలంటీర్‌ను పిలిచి క్లాస్ పీకారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసేలా మహిళలను చైతన్యవంతులు చేయాలని వలంటీర్లను కోరారు.
 
శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. అందులో భాగంగా పద్మావతి అనే మహిళకు ధ్రువపత్రం ఇచ్చిన సమయంలో ఓటు ఫ్యానుకే వేస్తావా? అని మంత్రి ఆమెను అడిగారు. లేదండి.. సైకిల్‌‍కు వేస్తానని బదులివ్వడంతో మంత్రి ఖంగుతిన్నారు. 
 
ఆ వెంటనే సంబంధిత వాలంటీరును పిలిచి గుర్తు గురించి చెప్పట్లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మరో లబ్ధిదారునికి ధ్రువపత్రం అందించి వెనుతిరిగారు. అంతకుముందు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసంగించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాజీవితంతో సంబంధం లేని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాలంటీర్లకు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు