గంజాయి మత్తుకు బానిసై ప్రియుడి ఆత్మహత్య... తీవ్రమనస్తాపంతో ప్రియురాలు కూడా..

మంగళవారం, 22 ఆగస్టు 2023 (08:58 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఓ విషాదాకర ఘటన జరిగింది. గంజాయి మత్తుకు బానిస అయిన ప్రియుడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడు ఇకలేడన్న వార్తను జీర్ణించుకోలేక, అతన్ని మరిచిపోలేక ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
యానాంలోని యూకేవీ నగర్‌కు చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తుంది. 
 
ఈ క్రమంలో గత రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నా అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే, గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కాకినాడలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
అప్పటి నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుకుగురైంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు