తప్పు మంత్రివర్గానిది, శిక్ష ఉద్యోగులకా?

గురువారం, 5 ఆగస్టు 2021 (16:39 IST)
ఆర్ధిక అవ‌క‌త‌వ‌క‌ల్లో త‌ప్పు మంత్రి వర్గానిది అయితే, శిక్ష కింది స్థాయి అధికారులు, ఉద్యోగులకా? అని మాజీ ఆర్ధిక మంత్రి య‌నమల రామకృష్ణుడు ప్ర‌శ్నించారు. ప్రభుత్వ నిధులు, ప్రజాధనం ఖర్చు చేయడానికి నిబంధనలు ఉన్నాయి. ప్రజల కోసమే ఖర్చు చేస్తే ప్రభుత్వం ఎందుకు పారదర్శకత పాటించ లేదు.

అసెంబ్లీకి, కాగ్, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఎందుకు దాచారు? మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు అధికారుల, ఉద్యోగులను బాద్యులను  చేసి శిక్ష వేయడాన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయ‌ని య‌న‌మ‌ల పేర్కొన్నారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువేమి ఖర్చు చేయలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు తెలుగు దేశం ప్రభుత్వం 16 లక్షల మందికి ఇవ్వగా.. దాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం 11 లక్షల మందికి కుదించింది. చంద్రన్న బీమా 2.47 కోట్ల మందికి వర్తింపజేయగా, వైసీపీ ప్రభుత్వం 67 లక్షలకే కుదించింది. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రైతు రుణాలను రూ.3 లక్షల వరకు వర్తింపజేయగా జగన్ రెడ్డి రూ.లక్షకు కుదించారు. డ్వాక్రా రుణాలకు సున్నా వడ్డీని టీడీపీ రూ.3 లక్షల వరకు వర్తింపజేయగా జగన్ రెడ్డి రూ.లక్షకే కుదించారు. సంక్షేమ పథకాల వల్ల, కరోనా వల్ల అప్పు చేయాల్సి వచ్చిందనే వైసీపీ వాదనలో పసలేద‌న్నారు య‌న‌మ‌ల‌.

జగన్ ప్రభుత్వం 25 నెలల్లో చేసిన అప్పులు
1. 2019-20                రూ.39,686.56 కోట్లు
2. 2020-21                రూ.55,161.51 కోట్లు 
3. 2021 ఏప్రిల్             రూ.19,714.04 కోట్లు 
4. కార్పొరేషన్ల ద్వారా      రూ.34,650.00 కోట్లు 
                      మొత్తం: రూ.1,49,212.11 కోట్లు
 
ఆధారం : కాగ్ రిపోర్టు & ఎస్.టి.సి డాక్యుమెంట్స్ 
చంద్రబాబు ప్రభుత్వం 60 నెలల్లో చేసిన అప్పులు 
1. 2014-15         రూ.18,089.11 కోట్లు
2. 2015-16         రూ. 5,110.15 కోట్లు
3. 2016-17         రూ.23,559.96 కోట్లు
4. 2017-18         రూ.25,064.93 కోట్లు
5. 2018-19         రూ.38,282.83 కోట్లు 
         మొత్తం : రూ.1,30,146.98 కోట్లు 
ఆధారం : ఆర్.టీ. లెటర్ నెం.f 01-బడ్జెట్ /7/2020 C&M
 
తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సరాసరిన రూ.26 వేల కోట్లు అప్పు చేయగా, వైసీపీ ప్రభుత్వం ఏడాదికి బడ్జెట్ అప్పులే సరాసరిన రూ.50 వేల కోట్లు చేసింది. బడ్జెట్ యేతర అప్పు రెండేళ్లలో మరో రూ.34 వేల కోట్లు చేసింది. అయినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.
 
సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. జగన్ రెడ్డి రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం రూ.9,450 కోట్లు మాత్రమే. తెలుగుదేశం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసి 10 వేల మెగావాట్లు విద్యుత్ ను అధనంగా ఉత్పత్తి చేసి కరెంటు కోతలు నివారించింది. విద్యుత్ చార్జీలు పెంచిందే లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం సుమారు 1000 మెగావాట్లు మాత్రమే పెంచింది. టీడీపీ 27 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించగా.. వైసీపీ నిర్మించింది 300 కి.మీ మాత్రమే అని వివ‌రించారు య‌న‌మ‌ల‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు