మన పిల్లలకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ఉద్దేశం : సీఎం జగన్

బుధవారం, 23 జూన్ 2021 (19:08 IST)
విజయవాడలోని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై ఒక స‌మీక్ష‌ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మాట్లాడుతూ, మ‌న పిల్ల‌ల‌కు మంచి ఉద్యోగాలు రావాడ‌మే ఐటీ పాల‌సీ ముఖ్యఉద్దేశమన్నారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రమవుతుంద‌న్నారు. 
 
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాల‌న్నారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏటా ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామ‌న్నారు. 
 
అంతేకాకుండా, 'మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. యాప్‌ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలి. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలన్నారు. 
 
ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలి. 
 
కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్‌ వినియోగం పెరుగుతుంది. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. 
 
దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలి. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలి’ అని తెలిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు