రాహుల్‌తో నారా బ్రాహ్మణి భేటీ ఎందుకో తెలుసా?: సుధాకర్ క్లారిటీ

గురువారం, 23 ఆగస్టు 2018 (10:38 IST)
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భాగ్యనగరంలోని పలువురు ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు.


ఈ సమావేశానికి హెరిటేజ్ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బ్రాహ్మణి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్‌తో నారాబ్రాహ్మణి భేటీ కావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై వైకాపా నేత టీజేఆర్ సుధాకర్ బాబు స్పందించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో దోస్తీకి సిద్ధపడ్డారనేందుకు నారాబ్రాహ్మణి రాహుల్‌తో భేటీ కావడం ఓ నిదర్శనమని చెప్పారు. రాహుల్ గాంధీకి, చంద్రబాబుకు మధ్య రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం నెరుపుతున్నారని సుధాకర్ తెలిపారు. చంద్రబాబు ఇతర పార్టీలతో పెళ్లిళ్ల సంగతి నిజం కాదా.. విడాకులు తీసుకుంది నిజం కాదా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ నేతలతో చర్చించారని, కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని చంద్రబాబు అన్నట్లు పత్రికల్లో కూడా వచ్చిందనే విషయాన్ని సుధాకర్ ఎత్తి చూపారు.  
 
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారని, గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారని సుధాకర్ ధ్వజమెత్తారు. ఇదేతరహాలోనే కాంగ్రెస్‌తో కలిసేందుకు కోడల్ని రాహుల్‌తో భేటీ అయ్యేలా చూశారని సుధాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఒంటరిగానే పోటి చేస్తుందని సుధాకర్ స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టట్లేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే చంద్రబాబు దోపిడీని కక్కిస్తామని సుధాకర్‌ బాబు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు