ఆనందయ్య నాటు మందుపై దుష్ప్రచారం వద్దు : వైకాపా ఎమ్మెల్యే

ఆదివారం, 23 మే 2021 (14:04 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి కోరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య మందు కోసం జనం బారుల తీరారని గుర్తుచేశారు. 
 
అనందయ్యను ఎవరూ అరెస్ట్‌ చేయలేదని చెప్పారు. ప్రభుత్వ విధివిధానాలు వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్‌ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
 
మరోవైపు, ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని ఆయేర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారు.. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తామన్నారు. 
 
వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని చెప్పారు. తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందయ్య ప్రభుత్వాన్ని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు