వైకాపా నుంచి మరో వికెట్ డౌన్ : రాజీనామా చేసిన ఎంపీ మాగుంట

వరుణ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే మచిలీపట్నం, నరసరావుపేటలకు చెందిన ఎంపీలు బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టాటా చెప్పేశారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం అధికారికంగా ప్రకటించారు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ, 33 యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. ఎనిమిదిసార్లు పార్లమెంట్‌కు, రెండు సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలకు పోటీ చేశానని చెప్పారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందన్నారు. వైకాపాను వీడిటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుుడ మాగుంట రాఘవరెడ్డి నిలపాలని నిర్ణయించామని తెలిపారు. 
 
కాగా, మాగుంటను వైకాపా హైకమాండ్ దూరం పెట్టిన విషయం తెల్సిందే. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు