ఇసుక నుంచి తైలం తీసే తెలివి జగన్‌కు లేదు : విజయసాయిరెడ్డి

శుక్రవారం, 22 మే 2020 (18:15 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇసుక నుంచి తైలం తీసే మీ తెలివి మా పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'కరెంటు బిల్లులపై పచ్చ పార్టీ దీక్షలను చూసి దేశమంతా నవ్వుతోంది. జాతీయ మీడియా, సోషల్ మీడియాలు వాటిని దీక్షలు అనలేమని తేల్చాయి. ఏసీ గదుల్లో కూర్చుని నిరసన కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే, ప్రజల కోసంకాకుండా ఎల్లో మీడియా కవరేజి కోసం తాపత్రయపడినట్టు కనిపిస్తోందని' అంటూ విజయసాటి రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, "కరెంటు గురించి జగన్‌గారికి అస్సలు అవగాహన లేదట. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్‌గారికి లేదు. పైగా ఒప్పందాలను రద్దు చేయాలంటున్నాడు. ఇసుక నుంచి తైలం తీసే మీతెలివి ఆయనకెక్కడిది'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ల రూపంలో విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు