అందంగా కనిపించాలంటే.. మేకపే సరిపోదు.. పోషకాహారం తీసుకోండి!

శనివారం, 9 ఫిబ్రవరి 2013 (15:43 IST)
FILE
అందం అనేది కేవలం మేకప్‌ వల్లే రాదు. చక్కటి పోషకాహారం తీసుకోవడం ద్వారా చర్మం కాంతిమంతంగా మారుతుంది. మీ మోము తాజాగా మెరవడానికి ఐదు రకాల ఆహారాన్ని తరచూ తీసుకుంటే చాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

నిమ్మరసం : చర్మాన్ని తాజాగా ఉంచి, ముడతలు పడనీయకుండా చూస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకున్నా లేదా రోజూ అర గ్లాసుడు తీసుకున్నా మీ చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసంతో చేసిన పదార్థాలను విరివిగా తినడం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.

గుడ్లు : రోజుకో గుడ్డు తింటే మంచిది అంటారు. తినడమే కాదు. గుడ్డులోని తెల్లసొనను తీసి ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మం నునుపు దేలి మెరుస్తుంది.

తేనె : ఉదయాన్నే ఒక చెక్క నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూను వేసుకుని తాగితే మంచిది. అలాగే దీనిని రోజు ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.

స్ట్రాబెర్రీస్ : ఎర్రని స్ట్రాబెర్రీలు నెలలో నాలుగైదు సార్లు తినడం వల్ల చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. విటమిన్ 'సి' యాంటిఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని మెత్తగా చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

అరటి పళ్లు : రోజుకో అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా తింటున్నప్పుడు చిన్న ముక్కతో ముఖమంతా రుద్దుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మానికి మేలు. తేనెలో ముంచి రాసుకున్నా ముఖం తాజాగా కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి