కరోనావైరస్: లక్షకు చేరువలో రోజువారి కేసులు, ఇలాగైతే మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదేమో!- Newsreel

శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:45 IST)
గడిచిన 24 గంటలలో భారత్‌లో 89,129 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6,58,909 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. తాజా పెరుగుదలతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,30,54,295కు చేరుకుంది.

 
గత కొద్ది రోజులుగా కరోనా కేసు సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి 15 వేలుగా ఉన్న రోజువారి కేసుల సంఖ్య మార్చి 30 నాటికి 53వేలకు, ఏప్రిల్‌ 2వ తేదీనాటికి 89వేలకు చేరుకుంది.

 
మహారాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌?
ఇక దేశవ్యాప్తంగా దాదాపు సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. శుక్రవారంనాడు అక్కడ 47,828 కేసులు నమోదయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించక తప్పదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు.

 
రాష్ట్రంలో వ్యాక్సీన్‌ తీసుకున్న వారికి కూడా కోవిడ్‌ వ్యాపిస్తోందని, మాస్క్‌ ధరించకపోవడమే దీనికి కారణమని సీఎం అన్నారు. లాక్‌డౌన్‌ విధింపుపై కార్యాచరణ సిద్ధం చేయాలని గత ఆదివారమే ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు సూచించారు. 

 
అయితే చాలాచోట్ల ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు పాటించడం లేదు. పుణేలో ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రార్ధనాలయాలు, హోటళ్లు, బార్లు షాపింగ్‌ కాంప్లెక్స్‌లను మూసేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు