మార్స్ ల్యాండింగ్: అంగారక గ్రహం మీద దిగుతున్న పెర్సెవీరన్స్ రోవర్ ఫొటోలివే...

శనివారం, 20 ఫిబ్రవరి 2021 (15:22 IST)
అంగారకునిపై రోవర్-నాసా
అంగారక గ్రహం మీదికి రోవర్‌ను పంపించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఆ గ్రహం మీద నుంచి వచ్చిన అద్భుతమైన ఫొటోలను విడుదల చేసింది. పెర్సెవీరన్స్ రోబో గురువారం నాడు మార్స్ మీద దిగుతున్న అద్భుత దృశ్యం ఒక ఫొటోలో కనిపిస్తోంది. రోవర్‌ను అంగారక గ్రహం ఉపరితలం మీదకు దించిన రాకెట్ క్రాడిల్‌ ఈ ఫొటోలు తీసింది.
 
పెర్సెవీరన్స్ తన మెమెరీలో భారీ స్థాయిలో డాటా నమోదు చేసింది. దానిని క్రమంగా భూమి మీదకు పంపుతోంది. మరొక ఫొటోలో.. రోవర్ పారాచూట్ సాయంతో గ్రహం మీదకు దిగుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు, ఈ సంఘటన సాంకేతికంగా మరో భారీ విజయానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో మార్స్ రికనయసాన్స్ ఆర్బిటర్ అనే ఈ ఉపగ్రహం.. పెర్సెవరాన్స్ నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉండి సెకనుకు మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
అంగారకునిపై రోవర్-నాసా
మరికొద్ది రోజుల్లో మరిన్ని దృశ్యాలు విడుదల చేస్తామని నాసా చెప్తోంది. పెర్సెవీరన్స్ అంగారకుడిపైకి దిగుతుండటం, గ్రహం మీద అడుగుపెట్టటం మొదలైన దృశ్యాలను ధ్వనితో సహా చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ కూడా వీటిలో ఉంటుంది. ఈ రోవర్‌ను మార్స్ మీద గ్రహమధ్య రేఖకు సమీపంలో జెజెరో అని పిలుస్తున్న ఒక భారీ లోయ సమీపంలో దించారు. గతంలో అక్కడ సూక్ష్మకణ జీవులు ఏమైనా ఉండేవా అనే సంకేతాల కోసం ఈ రోవర్ అన్వేషిస్తుంది.
 
ఈ రోవర్ కిందికి దిగుతున్న చిత్రం.. అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక చరిత్రాత్మక చిత్రంగా నిలుస్తుందని పెర్సెవరాన్స్ రోవర్ చీఫ్ ఇంజనీర్ ఆడమ్ స్టెల్టెజనర్ చెప్పారు. ‘‘ఈ ఫొటోలో ఇంజన్ల వేగం వల్ల రేగిన ధూళిని కూడా చూడవచ్చు. రోవర్ మార్స్ ఉపరితలానికి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉండి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
అంగారకునిపై రోవర్-నాసా
పెర్సెవీరన్స్ క్రమంగా తన వ్యవస్థలన్నిటినీ వినియోగంలోకి తేవటంతో అది సక్రమంగా పనిచేస్తోందని ఇంజనీర్లు నివేదించారు. రోవర్ మీది నావిగేషన్ మాస్ట్ మీద ప్రధాన సైన్స్ కెమెరాను అమర్చారు. దీనిని శనివారం వినియోగంలోకి తెస్తుంది.. ఆ కెమెరా ద్వారా జెజిరో క్రేటర్‌ను మరింత విస్పష్టంగా ఫొటోలు తీసి పంపిస్తుంది.
 
పెర్సెవీరన్స్ రోవర్‌ను మార్స్ మీద ల్యాండ్ చేయటానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం.. లక్ష్యంగా పెట్టుకున్న టచ్‌డౌన్ జోన్‌లో ఈ రోబోను దాదాపు కచ్చితంగా దించింది. ఈ ప్రాంతం.. ఒక సరస్సు ఒడ్డున ఏర్పడిన ప్రాచీన కాలపు నదీ మైదానానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లోయను పరిశోధించటం మొదలు పెట్టటానికి శాస్త్రవేత్తల బృందం చాలా ఆతృతగా ఉందని ప్రాజెక్ట్ డెప్యూటీ సైంటిస్ట్ కేటీ స్టాక్ మోర్గాన్ చెప్పారు.
 
తొలి ఫొటోలలోనే చాలా అద్భుతమైన రాళ్లు కనిపిస్తున్నాయని.. వాటి గురించి చాలా చర్చించవచ్పునని ఆమె విలేకరులతో పేర్కొన్నారు. మార్స్ మీద రోవర్ దిగిన ప్రాంతానికి.. శాస్త్రవేత్తలు కానియన్ డి చెల్లీ అని ముద్దు పేరు పెట్టారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో గల ఒక జాతీయ పార్కు పేరు అది. మార్స్ మీద 1.2 చదరపు కిలోమీటర్ల సదరు ప్రాంతంలో పెర్సెవీరన్స్ పరిశోధించే రాళ్లకు కూడా.. అమెరికా పార్కుకు సంబంధించిన పేర్లు పెడతారు.
 
నాసా అంగారక గ్రహం మీదకు పంపించిన ఐదో రోవర్ పెర్సెవరాన్స్. దీని తయారీకి 270 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇది తన తొలి మిషన్‌ను ఒక మార్స్ సంవత్సరం (సుమారు రెండు భూమి సంవత్సరాలు) కొనసాగిస్తుంది. ఆ తర్వాత కూడా రోబోలోని పరికరాలన్నీ పనిచేస్తున్నట్లయితే ఈ మిషన్‌ కాలపరిమితిని నాసా కొనసాగిస్తుంది. జీవం సంకేతాల కోసం అన్వేషించటంతో పాటు.. తర్వాత ఎప్పుడైనా భూమి మీది పరిశోధనశాలలకు తీసుకురావటానికి వీలుగా రాళ్లను వెదికి ప్యాక్ చేయటం కూడా పెర్సెవరాన్స్ చేయబోయే పనుల్లో ముఖ్యమైనది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు