భూమిపైకి దిగుతూ పేలిపోయిన స్పేస్ ఎక్స్... కారణమేంటి?

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (10:16 IST)
అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చంద్రుడు, అంగారకుడిపై ప్రయోగాలు చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం ఈ సంస్థ చేపట్టిన 'స్టార్‌షిప్‌' నమూనా రాకెట్‌ పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌ తీరంలో బుధవారం చేపట్టిన ఈ ప్రయోగంలో నమూనా (ప్రోటోటైప్‌) రాకెట్‌ భూమిపై దిగేసమయంలో కుప్పకూలింది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది. ఈ మేరకు రాకెట్‌ లాంచింగ్‌, పేలిపోయిన దృశ్యాలను ట్విట్టర్‌ అధికారిక ఖాతాలో ప్రసారం చేసింది. 
 
పేలిపోవడానికి కారణమేంటి? 
అయితే, ఈ ప్రయోగంలో భాగంగా, స్టార్‌షిప్‌ నమూనా రాకెట్‌ తొలుత అనుకున్నట్టుగానే నింగిలోకి దూసుకుపోయింది. ప్రొగ్రామ్‌ ప్రకారం.. రాకెట్‌లోని మొత్తం మూడు ఇంజిన్‌లలో రెండు ఇంజిన్‌లు పనిచేయడం ఆగిపోయిన వెంటనే రాకెట్‌ నిర్ణీత ఎత్తుకు వెళ్లి.. తిరిగి భూమి మీదకు దూసుకురావడం ప్రారంభించింది. 
 
4.45 నిమిషాల అనంతరం మూడో ఇంజిన్‌ కూడా సరైన సమాయానికే ఆగిపోయింది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో దూసుకువస్తున్న రాకెట్‌ వేగాన్ని అదుపు చేయడానికి మొదటి రెండు ఇంజిన్‌లు స్టార్ట్‌ అయ్యాయి. అయితే ఊహించని విధంగా రాకెట్‌ భూమిని వేగంగా ఢీకొట్టి పేలిపోయింది. అయితే, అసలు ప్రయోగం చేపట్టడానికి కావలసిన సమాచారం లభించిందని స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.
 
ఏమిటీ ప్రయోగం? 
మార్స్‌, చంద్రుడి మీదకు మనుషులు, సామగ్రిని తీసుకుపోయి, తిరిగి తీసుకువచ్చేందుకు ‘స్పేస్‌ఎక్స్‌' సంస్థ ‘స్టార్‌షిప్‌' సిరీస్‌ పేరిట వ్యోమనౌకలను తయారు చేస్తున్నది. ఇలాంటి బృహత్తర ప్రయోగాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అందుకనే, వీటికి సంబంధించిన నమూనా రాకెట్లను అసలు ప్రయోగానికి ముందుగా పరీక్షిస్తారు. ఇందులో భాగంగానే బుధవారం ‘స్పేస్‌ఎక్స్‌' ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు