ఏ సినిమాకైనా, ఏ రోజైనా ఒకటే రేటు: ప్రెస్ రివ్యూ

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఏ సినిమాకైనా, ఏ రోజైనా టికెట్ ధర ఒకేలా ఉంటుందని, పెంచుకోడానికి వీలు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు సాక్షి పత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న ఉత్సాహం చాలా మంది అభిమానుల్లో ఉంటుంది.

 
ఈ అభిమానాన్ని వీలున్నంత వరకు 'క్యాష్‌' చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది. ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమేంటన్నది అభిమానుల ఆక్రోశం కూడా.

 
ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది.

 
ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసిందని సాక్షి చెప్పింది. అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించిందని, ఇవి అన్ని సినిమాలకూ... అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చిందని కథనంలో రాశారు. తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అని సాక్షి వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు