World Cup: LIVE: ఆస్ట్రేలియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 27, టీమిండియాలా మారుతుందా?

గురువారం, 11 జులై 2019 (16:02 IST)
ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కీలకమైన 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వోక్స్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.

అంతకుముందు ఆర్చర్ బౌలింగ్‌లో కెప్టెన్ అరోన్ ఫించ్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కొద్దిసేపట్లోనే డేవిడ్ వార్నర్ కూడా వోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆస్ట్రేలియా 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఫించ్ పరుగులేమీ చేయకుండా అవుట్ కాగా వార్నర్ రెండు ఫోర్లతో 9 పరుగులు చేశాడు.
 
రెండో సెమీఫైనల్
క్రికెట్ ప్రపంచకప్-2019లో రెండో సెమీఫైనల్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ క్రీడాభిమానుల్లో అమితాసక్తి రేకెత్తిస్తోంది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను 64 పరుగుల తేడాతో ఓడించింది.
 
కీలకమైన సెమీఫైనల్‌లో మరోసారి ఇంగ్లండ్‌పై విజయం సాదించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతుండగా.. అటు ఇంగ్లండ్ కూడా లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఫైనల్‌లో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది.
 
ఐదుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా
క్రికెట్‌ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని ఘనతను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ఆసీస్ ఏకంగా ఐదు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. 2015 మార్చి 29న మెల్‌బోర్న్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. గతంలో 1987, 1999, 2003, 2007 వన్డే ప్రపంచ కప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
 
ఐదోసారి ఇంగ్లండ్ ఆతిథ్యం
ప్రపంచ కప్‌కు అత్యధికంగా ఐదోసారి ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇస్తోంది. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ టోర్నీలు కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. ఇంగ్లండ్‌ తర్వాత ఈ టోర్నీ ఎక్కువసార్లు భారత ఉపఖండంలో జరిగింది. 1987, 1996, 2011 టోర్నీలు భారత ఉపఖండంలో జరిగాయి. 2023లో జరిగే ప్రపంచ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతదేశంలోనే జరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు