వన్యప్రాణులకు నిలయం రాజస్థాన్‌

ఆదివారం, 3 జూన్ 2007 (18:04 IST)
రాజస్థాన్‌లో ఎడారి మాత్రమే కాకుండా వన్యప్రాణులతో నిండిన దట్టమైన అడవులు కూడా వున్నాయి. ఇక్కడి `సరిస్కా నేషనల్‌ పార్కు'లో రకరకాల వన్యప్రాణులు వున్నాయి. ఆరావళీ పర్వత శ్రేణులలోని అడవులలో వున్న ఈ పార్కుతో పాటు టైగర్‌ రిజర్వు కూడా రాజస్థాన్‌లో వుంది.

ఈ పార్కులో తోడేళ్ళు, అడవి పిల్లులు, చిరుత పులులు, ముళ్ళపందులు, ఇతర జంతువులు వున్నాయి. 1979లో ఈ పార్కును ప్రాజెక్‌‌ట టైగర్‌లో భాగంగా టైగర్‌ రిజర్వుగా చేశారు. ఈ పార్కు జైపూర్‌కు 110 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ పార్కు 800 చదరపు అడుగుల వరకు వ్యాపించి వుంది. ఇందులో చారిత్రాత్మక `కనక్‌వాడి' కోట వుంది.

ఇందులో ఔరంగజేబు తన సోదరుడిని బందీగా వుంచాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆళ్వార్‌ మహారాజులు నిర్మించిన ఓ రాజమహల్‌ను ప్రస్తుతం ఓ హోటల్‌గా మార్చారు. పర్యాటకులకు ఇది వసతిగృహంగా ఉపయోగ పడుతోంది.

సందర్శనకు అనువైన కాలం :
సంవత్సరమంతా పర్యాటకులు ఇక్కడికి వచ్చినా జులై, ఆగస్టులలో పశుపక్ష్యాదులు ఎత్తయిన ప్రాంతాలకు వెళతాయి. ఏప్రిల్‌, మేలలో వేడి ఎక్కువగా వుంటుంది. కాని, పర్యాటకులకు ఇది అనువైనకాలం - ఎందుకంటే పశుపక్ష్యాదులు దాహం తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. నవంబర్‌ కూడా సందర్శకులకు అనువైనదే.

ఎక్కడ బసచేయవచ్చు :
ఫారెస్‌‌ట రెస్‌‌టహౌస్‌, టైగర్‌ డెన్‌, టూరిస్టు బంగళా, హోటల్‌ లేక్‌ ప్యాలెస్‌, హోటల్‌ సరిస్కా ప్యాలెస్‌లో పర్యాటకులు తమ బసను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి :
సరిస్కా ఢిల్లీ-ఆళ్వార్‌-జైపూర్‌ మార్గంలో వుంది. ఆళ్వార్‌కు జైపూర్‌ 110 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ 200 కిలోమీటర్ల దూరంలో వుంది. జైపూర్‌ సమీపంలో విమానాశ్రయం కూడా వుంది.

వెబ్దునియా పై చదవండి