రైల్వే బడ్జెట్‌లో మార్పులు...చేర్పులు

రైల్వేబడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ బుధవారం గళమెత్తిన వివిధ పార్టీల సభ్యులు గురువారం కూడా లోక్‌సభలో తమ డిమాండ్లను వినిపించారు. దీంతో లోక్‌సభలో రైల్వేబడ్జెట్‌పై చర్చలో రెండోరోజూ అలజడి రేగింది. దీంతో మూజువాణి ఓటుతో రైల్వేబడ్జెట్‌ను ఆమోదించారు. ఇతర ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

** ఢిల్లీ...సికింద్రాబాద్‌, ఢిల్లీ...నాగపుర్ ప్రాంతాలకు రెండు నాన్‌స్టాప్‌ రైళ్ళను ప్రవేశపెడుతున్నట్లు మమత ప్రకటించారు.

** రైల్వే ఉద్యోగాల్లో స్థానికులకు 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక భాషల్లో పరీక్షల ప్రశ్నాపత్రాలు

** ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఆదర్శ నమూనా స్టేషన్ల జాబితాలోకి మరికొన్ని స్టేషన్లు. జాబితాలో గోవా, కాలికట్‌, కాకినాడ, నిజామాబాద్‌, ఉనా, రోహ్‌తక్‌, మీరట్‌, మహబూబ్‌నగర్‌, థేన్‌కల్‌ స్టేషన్లున్నాయి.

** రైల్వేలను మరింత వృద్ధిబాటలోకి తీసుకువెళ్ళేందుకుగాను వాణిజ్య ప్రణాళిక కోసం ఫిక్కి సెక్రటరీ జనరల్‌ అమిత్‌ మిత్రా నేతృత్వంలో నిపుణుల బృందం. రైల్వే బోర్డు సభ్యులు ఇందులో ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.

** రైళ్ళ సమయపాలన, సౌకర్యాలు, పరిశుభ్రతపై సీనియర్‌ ఉన్నతాధికారుల నేతృత్వంలో పర్యవేక్షక కమిటీలు. రైల్వేల్లో ప్రయాణీకుల రక్షణ బాధ్యత రైల్వే బోర్డు ఛైర్మెన్‌దే.

** బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలన్నీ ఏడాదిలో అమలు. సాధ్యమైనంత త్వరలో శ్వేతపత్రం. ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదని, రైల్వేల పూర్వ, ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు, భవిష్యత్‌ రూపకల్పన కోసమేనని ఆమె ప్రకటించారు.

** డబుల్‌ డెక్కర్‌ రైళ్ళను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెడతామని మమత తెలిపారు.

** రైల్వేల్లో ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించడం సమస్యగా మారింది, దీని పరిష్కారం కోసం భారతీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సిటిసి)ని పునరుద్దరిస్తామని ఆమె తెలిపారు.

** ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టేషన్లను తీర్చిదిద్దేందుకు గ్లోబల్‌ టెండర్లు. రైల్వే నిధులను వీటి కోసం ఉపయోగించబోమని, సౌకర్యాల మెరుగుదలకే ఈ నిధులని ఆమె వివరణ ఇచ్చారు. 11 వేల నుంచి 18 వేల బోగీలకు రైల్వేల విస్తరణ.

వెబ్దునియా పై చదవండి