మాంసాహారానికి భలే డిమాండ్..భారీగా పెరిగిన చికెన్ ధర

సోమవారం, 12 జులై 2021 (11:06 IST)
మాంసాహారానికి భలే డిమాండ్. ఆషాఢం, బోనాల పండుగ కావడంతో చికెన్‌కు గిరాకీ మరీ పెరిగింది. మటన్‌ ధర భారీగా ఉండటంతో చాలా మంది కోడి మాంసాన్ని తెచ్చుకొని తింటుంటారు. ఇక కిలో నాటు కోడి ధర రూ.700-750 వరకు పలుకుతోంది. బోనాల సమయంలో నాటుకోళ్లకు డిమాండ్‌ ఎక్కువ ఉంది. కరోనా కారణంగా అందరూ రోజు గుడ్లను తింటుండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది. 
 
హోల్‌సేల్‌ దుకాణాల్లో డజన్‌ గుడ్లు రూ.65 నుంచి రూ.68 పలుకుతున్నాయి. కిరాణ దుకాణాల్లో రూ.72కు విక్రయిస్తున్నారు. అలాగే చికెన్‌ ధర కూడా కుతకుతలాడుతోంది. వారం.. వారం ధర పైపైకి ఎగబాకుతోంది. ఈ ఆదివారం కిలో చికెన్‌ ధర ఒక్కసారిగా రూ.240 నుంచి రూ.260కి చేరింది. 
 
హోల్‌సేల్‌లో రూ.240 ఉండగా, రిటైల్‌లో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. గత ఆదివారం కిలో చికెన్‌ రూ.180 నుంచి 200 లోపు మాత్రమే ఉంది. వారంలోనే కిలోకు ఒక్కసారిగా రూ.60 పెరిగింది. ఆదివారం నుంచి బోనాల పండుగ మొదలు కావడంతో హైదరాబాద్‌లో కోళ్లు, మేకలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరంభంలోనే చికెన్‌ ధర భారీగా ఉండటంతో జనం బెంబేలెత్తున్నారు. 
 
కరోనా మొదటి వేవ్‌ ఆరంభంలో చికెన్‌ ధరలు అమాం తం పడిపోయాయి. అయితే చికెన్‌ వల్ల కరోనా రాదని, ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చికెన్‌, గుడ్లు తప్పనిసరిగా తినాలని చెప్పడంతో మళ్లీ చికెన్‌ దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. 

వెబ్దునియా పై చదవండి