నన్ను తొలగించడం అసాధారణ విపరీత చర్య... బోర్డుపై మిస్త్రీ ఈమెయిల్‌ అస్త్రం

బుధవారం, 26 అక్టోబరు 2016 (16:05 IST)
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి అవమానకరరీతిలో సైరన్ మిస్త్రీని తొలగించడం ఇపుడు దేశ పారిశ్రామిక రంగంలో పెను చర్చనీయాంశంగా మారింది. దీనిపై మిస్త్రీ టాటా బోర్డుకు ఈమెయిల్ అస్త్రాన్ని సంధించారు. ఇలా తనను తొలగించడం బోర్డుకు ఏమాత్రం శోభకరం కాదని పేర్కొన్నారు. కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అంటూ బోర్డు మీద మండిపడ్డారు. టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యలు ఉండగా అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనను సమర్థించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు టాటా బోర్డు చేపట్టిన చర్యపై సైరన్ మిస్త్రీ న్యాయ పోరాటం చేస్తారంటూ వస్తున్న వార్తలను మిస్త్రీ కార్యాలయం కొట్టిపారేసింది. ప్రస్తుత దశలో లీగల్‌ చర్యలు తీసుకొనేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, సైరన్ మిస్త్రీని తొలగించడం వెనుక బలమైన కారణాలు లేకపోలేదు. ప్రధానంగా టాటా కంపెనీ ఆస్తులను అమ్మడం, ముఖ్యంగా రతన్‌ టాటా కొనుగోలు చేసిన యూకే స్టీల్‌ పరిశ్రమను విక్రయించడం వల్లే టాటాలకు మిస్త్రీపై కోపం వచ్చిందని, అందుకే ఆయనను అర్ధంతరంగా తొలగించినట్టు రతన్‌ టాటా లీగల్‌ అడ్వైజర్‌ హరీష్‌ సాల్వే తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి