బంగారంపై పెట్టుబడికి ఇదే కరెక్ట్ సమయమంటున్న నిపుణులు.. ఎందుకని?

వరుణ్

బుధవారం, 24 జులై 2024 (10:48 IST)
బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇదే సరైన సమయమని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాల్లో భారీగా కోత విధించి, జీఎస్టీని మాత్రం యధాతథంగా ఉంచారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇదే అనువైన సమయమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సోవరిన్ గోల్డ్ బాండ్స్ మరింత లాభాదాయకమని అభిప్రాయపడుతున్నారు. అయితే, భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయని వారు పేర్కొంటున్నారు. 
 
కాగా, మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెను సంచలనానికి తెరతీశారు. బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై సుంకాల్లో సగానికిపైగా కోత పెట్టడంతో వాటి ధరలు మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. ఇప్పటివరకూ బంగారం, వెండిపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ ఉండగా, దీన్ని 5 శాతానికే పరిమితం చేశారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకాన్ని 5 శాతం నుంచి 1 శాతానికి పరిమితం చేశారు. ఫలితంగా మొత్తం కస్టమ్స్ సుంకం 15 శాతం నుంచి 6 శాతానికి దిగివచ్చింది. జీఎస్టీ కూడా కలుపుకుంటే ప్రస్తుతం పసిడి, వెండిపై సుంకాల పన్ను భారం 18 నుంచి 9 శాతానికి తగ్గింది. సుంకాలు ఒక్కసారిగా తగ్గడంతో మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ. 6,200 మేర తగ్గింది. వెండి ధర కూడా కిలోకు రూ.3 వేల మేర పతనమైంది.
 
బంగారం ధరలు తగ్గడంపై రిటైల్ వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో పెరిగి స్థిరీకరణ చెందుతాయని చెబుతున్నారు. డాలర్, రూపాయి మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, భౌగోళికరాజకీయ పరిణామాలు, చైనా ప్రభుత్వ నిర్ణయాలు వెరసి బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి, ఇన్వెస్టర్లు ఈ సమయాన్ని పెట్టుబడులకు వినియోగించుకుంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగాక మంచి లాభాలు కళ్లచూడొచ్చని అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు