రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించనున్నారా?

గురువారం, 27 మే 2021 (22:15 IST)
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికను బట్టి తెలుస్తోంది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లు అని వెల్లడైంది. అంటే ఒక ఏడాదిలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణీ నుంచి తప్పుకున్నాయని అర్థమవుతోంది.
 
అయితే ఈ నోట్లు చలామణీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణాలేమిటో తెలియడం లేదు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో నగదు డిమాండ్‌ను తట్టుకునేందుకు రూ.500 నోట్ల ముద్రణను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లలో రూ.500 నోట్ల వాటా 68.4 శాతం. ఇది గత ఏడాది 60.8 శాతంగా ఉండేది.
 
రూ.2,000 నోట్లను అక్రమంగా దాచుకోవడం సులువుగా మారిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లభ్యతను మెరుగుపరచడంలో ఈ నోట్లు ఉపయోగపడినట్లు కొందరు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు