బైట్‌డ్యాన్స్‌కు భారత్‌లో మరో ఎదురుదెబ్బ.. బ్యాంకు ఖాతాలు సీజ్

బుధవారం, 31 మార్చి 2021 (13:17 IST)
టిక్ టాక్ మాతృ సంస్థ "బైట్‌డ్యాన్స్‌"కు భారత్ లో మరో ఎదురు దెబ్బ తగిలింది. బ్యాన్ కారణంగా ఇప్పటికే వేలకోట్లు నష్టపోయిన బైట్‌డ్యాన్స్‌ దేశంలో పన్నులు ఎగవేసినట్లుగా అభియోగాలు రావడంతో.. సిటీబ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో బైట్‌డ్యాన్స్‌ సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. భారత అధికారులు తీసుకున్న నిర్ణయంతో బైట్‌డ్యాన్స్‌ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
 
ఈ క్రమంలోనే తమ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసిన విషయంపై కోర్టుకు వెళ్ళింది బైట్‌డ్యాన్స్‌ సంస్థ. తమ ఖాతాలను తెరిపించి తమకు న్యాయం చెయ్యాలని కోరింది. కాగా భారత్, చైనా మధ్య గతేడాది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. ఆ పరిస్థితుల్లో చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌తో పాటు హెలో, షేర్‌ఇట్, షేర్ చాట్ వంటి యాప్స్‌ను కూడా భారత ప్రభుత్వం ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
 
భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనా కంపెనీలు తీవ్రంగా నష్టపోగా.. బైట్‌డ్యాన్స్‌ సంస్థ ఒక్కటే 6 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు చైనాలోని ప్రముఖ పత్రిక ది గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. భారత కరెన్సీలో రూ. 45వేల కోట్లు నష్టపోయింది అన్నమాట. టిక్ టాక్ వాడేవారు భారత్‌లోనే అధికంగా ఉండగా.. మే నాటికి టిక్ టాక్ 11.2కోట్ల మంది ప్లే స్టోర్ నుంచి టిక్‌టాక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు