పండగల రద్దీ కోసం ప్రత్యేక రైళ్లు... తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే రైళ్లు ఏవి?

సోమవారం, 5 అక్టోబరు 2020 (09:36 IST)
దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఏర్పడే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లను నడిపేలా కార్యాచరణను రూపొందించింది. అందులో 17 దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లను ఈ నెల 15వ తేదీ నుంచి నడుపనున్నారు. 
 
ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్ రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్ పూర్తయి పోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ డిమాండ్ నేపథ్యంలో తమకు 17 రైళ్లు కావాలంటూ దక్షిణ మధ్య రైల్వే పంపిన ప్రతిపాదనపై రైల్వే బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
 
ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం నడుస్తున్న గౌతమి, నర్సాపూర్, నారాయణాద్రి, చార్మినార్, శబరి, గౌహతి ఎక్స్‌ప్రెస్‌లతోపాటు మరో 11 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. 
 
పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనంగా మరో 200 రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. వీటిని అధికారికంగా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్ ప్రారంభం కానుంది.
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్లలో.. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం, గౌహతి, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్, రాజ్‌కోట్, హౌరాకు రైళ్లు నడవనుండగా, హైదరాబాద్ నుంచి చెన్నై, జైపూర్, రాక్సల్‌కు నడుపుతారు. 
 
అలాగే, కాచిగూడ నుంచి మైసూర్‌కు, కడప నుంచి విశాఖకు, పూర్ణ నుంచి పాట్నాకు, విజయవాడ నుంచి హుబ్బళ్లికి, తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరావతికి, నాగ్‌పూర్ నుంచి చెన్నైకి, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు రైళ్లు నడవనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు