క్రెడిట్ - డెబిట్ కార్డులకు ఇకపై నెట్‌వర్క్.. మీకు నచ్చిన కార్డును ఎంచుకోవచ్చు...

శుక్రవారం, 7 జులై 2023 (12:56 IST)
క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల విషయంలో కష్టమర్ తనకు నచ్చి విధంగా పేమెంట్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వెసులుబాటును భారత రిజర్వు బ్యాంకు కల్పించింది. మాస్టర్ కార్డు నుంచి రూపే, రూపే కార్డు నుంచి మాస్టర్‌ కార్డుకు.. ఇలా నచ్చిన కార్డు నెట్‌వర్క్‌కు మారడానికి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 
 
ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఈ సౌకర్యాన్ని అక్టోబర్ 1, 2023 నుండి అందుబాటులోకి తీసుకురావాలని కార్డు జారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది అమల్లోకి వస్తే వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తదితర కార్డులలో కస్టమర్ తనకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు.
 
కార్డు జారీ సంస్థలు ఇప్పటి వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం కస్టమర్ ఏ కార్డును వినియోగించాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. కానీ అక్టోబరు నుండి ఇది కస్టమర్ ఛాయిస్ కానుంది. ఒక కార్డు ఉన్న వారు మరో కార్డుకు మారవచ్చు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పై ఆర్బీఐ అభిప్రాయాలు కోరుతోంది.
 
డ్రాఫ్ట్ ప్రకారం కార్డు జారీ చేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని, కస్టమర్లు ఇతర నెట్ వర్క్ సేవలను పొందకుండా నిరోధించవద్దు. కార్డు జారీ చేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ నెట్ వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులు జారీ చేయాలి. అర్హులైన కస్టమర్లకు కార్డును ఎంచుకునే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా మరో కార్డుకు మారే అవకాశం ఇవ్వాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు