యూకేలోనే నీరవ్ మోదీ... విజయ్ మాల్యా కూడా లండన్‌లోనే

సోమవారం, 20 ఆగస్టు 2018 (19:00 IST)
ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ యూకేలో వున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూకే అధికారులు కూడా ధ్రువీకరించినట్లు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అతన్ని తిరిగి భారత్‌కు పంపించాలని కోరుతూ సీబీఐ అధికారులు యూకేను కోరారు. పంజాబ్ నేషనల్‌ బ్యాంకును వేల కోట్ల రూపాయలకు మోసగించి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. 
 
దాదాపు రూ.13వేల కోట్ల మోసాలకు నీరవ్ పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం బయటపడడానికి కొద్ది రోజుల ముందే ఈ ఏడాది జనవరిలో వీరు దేశం విడిచి పారిపోయారు. అప్పటినుంచి వారిని భారత్‌ రప్పించాలని ఇక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
 
కానీ నీరవ్ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇన్ని రోజులు స్పష్టత రాలేదు. తాజాగా యూకే అధికారులే ధ్రువీకరించడంతో నీరవ్‌ యూకేలో ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నీరవ్‌, ఛోక్సీల పాస్‌పోర్ట్‌లను భారత్‌ రద్దు చేసింది. అయినప్పటికీ నీరవ్‌ వివిధ దేశాలకు వెళ్తూనే ఉన్నారు. 2002 నుంచి భారత ప్రభుత్వం 29 మంది పారిపోయిన నేరగాళ్లను స్వదేశానికి పంపించాల్సిందిగా యూకేను కోరింది. 
 
ఇందులో నీరవ్‌ 29వ వ్యక్తి. అయితే గత పదహారేళ్లలో యూకే 9 సార్లు భారత అభ్యర్థనను తిరస్కరించింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా పారిపోయిన మరో వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కూడా లండన్‌లోనే ఉన్నాడు. మాల్యాను భారత్‌కు తిరిగి పంపించాలని మన ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై అక్కడి కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు