’చపలచిత్తం’ గల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని వ్యాపార అవకాశాలు తెరపైకి వచ్చాయని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసంతోటే అమెరికాలో తమ పెట్టుబడులను రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
ట్రంప్ తన దేశమైన అమెరికాను పునర్నిర్మించాలనుకుంటున్నారే కాని ప్రపంచాన్ని కాదని ఆనంద్ మహేంద్ర అభిప్రాయ పడ్డారు. అమెరికా ఇప్పటికీ శక్తివంతమైన దేశమేనని ట్రంప్ మనందరినీ నిద్రలేపుతాడని, నూతన వ్యాపారావకాశాల అంచుమీద మనల్ని నిలబెడతాడని చెప్పారు.
అంతకుముందే రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా ట్రంప్ విధానాలు దేశీయ ఐటీ కంపెనీలకు మారురూపంలో ఉన్న ఆశీర్వాదం లాంటివని కొనియాడటం విశేషం. అమెరికా వంటి అతి పెద్ద మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలపై భారతీయ ఐటీ పరిశ్రమ దృష్టి సారిస్తే ట్రంప్ విధానాలు మనకు నిజంగానే వరంలాగా మారతాయని ముఖేష్ నొక్కి చెప్పారు.