మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని కన్నతల్లినే రాయితో కొట్టి చంపేసిన కసాయి కొడుకు!

బుధవారం, 6 జులై 2016 (16:38 IST)
మద్యానికి బానిసైన ఓ యువకుడు మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే రాయితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన కేవి కుప్పం సమీపంలోని మచ్చానూర్ కొల్లమేడు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి అమృదం(70) అనే వృద్ధ మహిళకు సుబ్రమణి అనే కుమారుడున్నాడు. సుబ్రమణికి వివాహం జరిగి ఒక కుమారుడున్నాడు. అయితే సుబ్రమణి పనిచేయకుండా మద్యానికి బానిసై తరుచూ భార్యా, కొడుకును హింసించేవాడు. దీంతో విరక్తి చెందిన ఇతని భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని తరచూ తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుబ్రమణి మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆవేశం చెందిన సుబ్రమణి ఇంటి సమీపంలో ఉన్న పెద్ద రాయిని తల్లి తలపై మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అమృదం అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. 
 
సుబ్రమణి వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. ఇంటి సమీపంలో మృతి చెంది ఉన్న అమృదంను మంగళవారం ఉదయం స్థానికులు గమనించి కేవీ కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరారీలో ఉన్న సుబ్రమణిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా మద్యం తాగేందుకు నగదు ఇవ్వకపోవడంతోనే తల్లిని హత్య చేసినట్టు నేరాన్ని ఒప్పకున్నాడు. దీంతో పోలీసులు అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి