ఉపాధ్యాయులను కాటేసిన కరోనా రక్కసి.. 47మంది ఉపాధ్యాయులు మృతి

ఆదివారం, 6 జూన్ 2021 (08:43 IST)
ఉపాధ్యాయులను కరోనా రక్కసి బలి తీసుకుంది. పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయులు కరోనా కాటుకు బలవుతున్నారు. ఇప్పటివరకు 47మంది ఉపాధ్యాయులు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 మంది, నిర్మల్ లో 8, మంచిర్యాల జిల్లాలో 15 మంది, కుమ్రంభీం జిల్లాలో మరో 14 మంది టీచర్స్‌ను వైరస్‌ బలితీసుకుంది.
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2271 ప్రాథమిక పాఠశాలలు, 383 ప్రాథమికోన్నత పాఠశాలు, మరో 385 హైస్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 9 వేల మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.
 
పలువురు రిటైర్డ్‌ ఉపాధ్యాయులు సైతం… కరోనా కాటుకు ప్రాణాలు విడిచారు. మంచిర్యాల జిల్లా గద్దె రాగడి గ్రామంలో ఓ ఉపాధ్యాయ జంటను కబళించింది. భార్యాభర్తలు శైలజ, సీతారామరాజు కోవిడ్‌తో రెండు రోజుల వ్యవధిలో చనిపోయారు. అంతకుముందు వారి పెద్ద కూతురు యశ్విని మూడు నెలల క్రితం చనిపోయింది. రెండో కూతురు ఇప్పుడు ముగ్గురినీ కోల్పోయి అనాథగా మిగిలింది.
 
కరోనాను ఆలస్యంగా గుర్తించడం, ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు మృత్యువాతపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగినన్ని మందులు, బెడ్స్‌, ఆక్సిజన్‌ నిల్వలు లేకపోవడం శాపంగా మారింది.
 
ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయం లేకపోవడంతో… ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో అధికారులు తీరుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు