24 గంటల్లో కొత్తగా 3277 కేసులు.. తాడేపల్లి ప్రకాశ్ నగర్‌లో భయంభయం..

ఆదివారం, 10 మే 2020 (10:09 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దూకుడుకు బ్రేకులు ఏమాత్రం పడటం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 3277 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
వీరితో కలుపుకుని ఇప్పటివరకు కరోస్ బారినపడి మొత్తం 2109 మంది చనిపోయారు. అలాగే, కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని మొత్తం 62,939కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 19,358  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుండగా, గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం కొత్తగా మరో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరుకోగా, ఒకరు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితమే రెండు కేసులు నమోదు కావడం, ఇప్పుడు మరో రెండు కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో భయం మొదలైంది. ఇక, శనివారం వెలుగు చూసిన రెండు కేసులు ప్రకాశ్‌నగర్‌లోనివే కాగా, ఇటీవల చనిపోయిన వ్యక్తి కూడా ప్రకాశ్ నగర్‌కు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.
 
మరోవైపు, ఇటీవల చనిపోయిన వ్యక్తికి నిర్వహించిన స్వాబ్ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయవాడ, తాడేపల్లిలో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులు 43 మందిని గుర్తించి పరీక్షలు చేశారు. వీటిలో కొన్నింటి ఫలితాలు నిన్న వచ్చాయి. ఇటీవల చనిపోయిన వ్యక్తి భార్య, ఆయన కుమారుడికి కూడా కరోనా సోకినట్టు వీటిలో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు