ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం : 21 వేలు దాటిన పాజిటివ్ కేసులు

మంగళవారం, 7 జులై 2020 (16:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడచిన 24 గంటల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 238 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అనంతపురం జిల్లాలో 153, విశాఖపట్నం జిల్లాలో 123, తూర్పుగోదావరి జిల్లాలో 112, శ్రీకాకుళం జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 100 కేసులు గుర్తించారు.
 
అన్ని జిల్లాల్లో కలిపి 1178 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కి చేరింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో 13 మంది కరోనాతో మృత్యువాతపడగా, రాష్ట్రంలో మరణాల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా 762 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 11,200 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో, ఆసుపత్రుల్లో రద్దీని తగ్గించేందుకు, అత్యవసరమైన చికిత్స అవసరమైన పేషెంట్లకు బెడ్లు ఖాళీగా ఉంచేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు ఇవే.
 
* కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ... వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే 10 రోజుల పాటు చికిత్స చేసి ఇంటికి పంపిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లినవారు... మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.
 
* వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లక్షణాలు లేని వారిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉండి, ఆక్సిజన్ అవసరమైన వ్యక్తులను కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తారు. అక్కడ మూడు రోజుల్లో కరోనా లక్షణాలు తగ్గిపోతే... నాలుగో రోజు డిశ్చార్జి చేస్తారు.
 
* వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని మాత్రం... పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి పంపుతారు. ఇలాంటి వారు కరోనా పూర్తిగా తగ్గేంత వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు కోవిడ్ కోసం ప్రభుత్వం 1075 అనే హెల్ప్ లైన్ నంబరును ఏర్పాటు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు