కోవిడ్ వైరస్ నుంచి కోలుకుంది.. కానీ శరీరమంతా చీముతో నిండిపోయింది..!

గురువారం, 24 డిశెంబరు 2020 (16:25 IST)
కరోనా నుంచి దూరంగా వుండటం మేలు. లేదంటే కరోనా సోకిన తర్వాత ఏర్పడే లేనిపోని ఇబ్బందులతో నానా తంటాలు పడక తప్పదు. తాజాగా అలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది.

కరోనా సోకడంతో చికిత్స పొందిన ఓ మహిళ.. ఆస్పత్రి నుంచి విడుదల అయ్యింది. కానీ ఆ మహిళ శరీరమంతా చీముతో నిండిపోయింది. దీంతో మూడుసార్లు ఆమెకు శస్ర్త చికిత్స నిర్వహించి చీమును తొలగించారు వైద్యులు.

ముంబై ఔరంగాబాద్‌లోని బజాజ్ నగర్‌కు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరింది. కొద్ది రోజుల తర్వాత ఆమె వెన్నునొప్పితో పాటు నడుము నొప్పితో బాధపడుతోంది.
 
దీంతో ఆమె నవంబర్ 28న హెడ్గేవార్ ఆస్పత్రికి వెళ్లింది. ఆ మహిళ కాళ్లు కూడా వాచిపోయాయి. దీంతో బాధితురాలికి వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించగా, మెడ భాగంతో పాటు వెన్ను భాగంలో చీము నిండిపోయినట్లు తేలింది. అంతే కాదు.. చేతులు, పొట్ట భాగంలో కూడా చీము ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.
 
ఆ తర్వాత మూడు పర్యాయాలు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి హాఫ్ లీటర్ చీమును తొలగించారు. అయితే శరీరంలో ఏమైనా కణితిలు పగలడం వల్ల లేదా, ఫ్యాక్చర్ జరిగినా ఇలా చీము ఏర్పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఏడు మాత్రమే నమోదు అయ్యాయి. భారత్‌లో ఇదే తొలి కేసు అని వైద్యులు తెలిపారు. డిసెంబర్ 21న మహిళను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు