తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతున్న ఏవై-12 వైరస్

ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:52 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో కరోనా వైరస్ సృష్టించిన విలయం అంతాఇంతాకాదు. అనేక మంది ప్రాణాలను హరించింది. ఈ వైరస్ కొంతమేరకు శాంతించింది. అయితే, ఇపుడు కొత్తగా ఏవై-12 అనే పేరుతో కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. ఈ వేరియంట్ ఎంతో ఆందోళనకు గురిచేసింది. 
 
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఇది ఉపరకం. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ గత నెల 30న ఉత్తరాఖండ్‌లో వెలుగు చూడగా, వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పాకింది. 
 
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 178 కేసులు నమోదు కాగా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదుకావడం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తెలంగాణలోని వికారాబాద్‌లో 9, వరంగల్‌లో నాలుగు, హైదరాబాద్‌లో 2 కేసులు వెలుగు చూశాయి. కేసుల విషయంలో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో ఉంది.
 
ఇకపోతే, డెల్టాప్లస్ వేరియంట్‌కు సంబంధించి తమ వద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షించిన సీసీఎంబీ.. వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్నట్టు గుర్తించింది. ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతోందని, మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను అది తగ్గిస్తోందని గుర్తించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
 
మరోవైపు, ఏప్రిల్ నుంచి దేశంలో డెల్టా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్‌‌లో పుట్టుకొచ్చిన ఉప రకాలను ఏవై.1, ఏవై.2, ఏవై.3.. వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఏవై.12 వేరియంట్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు