నారు పోసిన వాడే నీరు పోస్తున్నాడు.. కరోనాకు చైనా విరుగుడు

బుధవారం, 18 నవంబరు 2020 (17:52 IST)
కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనా.. దానికి విరుగుడు మందు కనిపెడుతోంది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వల్ల నాలుగు వారాల్లోనే పేషెంట్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తేలింది. ఆ వ్యాక్సిన్ పేరు- కరోనావ్యాక్. సినోవాక్‌ బయోటెక్‌ ప్రయోగాత్మక ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. సినోవాక్‌ బయోటెక్ సంస్థ యాజమాన్యం ప్రస్తుతం ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీలో మూడవ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.
 
చైనాలో అభివృద్ధి చేసిన కరోనావాక్ సహా నాలుగు వ్యాక్సిన్లు చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ కరోనా పేషెంట్లపై ఎలాంటి ఫలితాలను చూపించిందనే విషయంపై మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఇతర వ్యాక్సిన్‌లతో పోలిస్తే.. కరోనావ్యాక్ పేషెంట్ శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని నాలుగు వారాల్లోనే అందించగలదని వైద్య నిపుణులు తెలిపారు.
 
14 రోజుల వ్యవధిలో రెండు డోసుల కరోనావ్యాక్ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ద్వారా నాలుగు వారాల్లోనే రోగనిరోధక శక్తి పెరిగినట్లు పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు అంటున్నారు. వైరస్ బారిన పడిన పేషెంట్‌కు అత్యవసరంగా ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు