కరోనాకు విరుగుడు కనిపెట్టిన ఆక్స్‌ఫర్డ్? వివరాలు వెల్లడించనున్న శాస్త్రవేత్తలు

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (12:05 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలు చేస్తున్న సంస్థల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వీరు ఆస్ట్రాజెనికా ఫార్మా సంస్థతో కలిసి టీకీ తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండు దశల్లో ఈ టీకా ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 
 
అయితే, ఈ సంస్థలు తయారు చేసిన టీకాను బ్రెజిల్ దేశంలో తీసుకున్న ఓ వలంటీర్ మరణించాడు. దీంతో ఈ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఆ వలంటీర్ మరణానికి టీకా కారణం కాదని, ఇతర అనారోగ్య సమస్యల ఉన్నట్టు నిర్ధారించి, మళ్లీ ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలపై పరిశోధకులు శుభవార్త తెలిపారు. దీని ఫలితాలు అశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. 
 
కొత్త పద్ధతులను వినియోగించి వ్యాక్సిన్ ఏ విధంగా రోగ నిరోధకతను ఉత్తేజపరుస్తుందోన్న విషయాలు పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ‘రిసెర్చ్‌ స్క్వేర్‌ జర్నల్’‌లో ఓ కథనం ప్రచురితమైంది. 
 
మానవ శరీరంలో జన్యు సూచనలను ఇది పాటిస్తుందా? అనే విషయాన్ని గుర్తించడంలో ఈ పరిశోధన చాలా కీలకమని  బ్రిస్టల్స్‌ స్కూల్‌ ఆఫ్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ మెడిసిన్‌(సీఎంఎం) వైరాలజీ పరిశోధకులు తెలిపారు.  ఈ వ్యాక్సిన్ శరీరంలో పరిశోధకులు ఊహించినట్లుగానే పని చేస్తోందని పరిశోధనలో తేలింది.
 
టీకా మానవ కణాల లోపలికి చేరినప్పుడు సరిగ్గా ఏమి చేస్తుందో పరిశీలించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. పెద్ద మొత్తంలో కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తి అవుతున్నట్టు అధ్యయనంలో భాగంగా నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు. 
 
రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో టీకా విజయాన్ని వివరించడానికి తాము చేసిన పరిశోధన తోడ్పడుతుందని చెప్పారు. అయితే, ఈ టీకా అభివృద్ధి, పనితీరుకు సంబంధించి మరిన్ని విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు