బాబు ఇంటివద్ద విధులు నిర్వహించిన ఖాకీకి కరోనా!!

ఆదివారం, 14 జూన్ 2020 (09:13 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటివద్ద విధులు నిర్వహించే పోలీసుల్లో కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ మే 5వ తేదీన విధుల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లాడు. దాదాపు నెల రోజుల పాటు చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్తు విధులు నిర్వహించాడు. 
 
ఈ నెల 7న తిరిగి బాపట్లకు వచ్చాడు. ఆపై అనారోగ్యం బారిన పడగా, కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు మూడు రోజుల క్రితం నమూనాలు సేకరించారు. 
 
ఆపై వచ్చిన ఫలితాల్లో ఇతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. హైదరాబాద్ లో పని చేస్తున్న సమయంలో తోటి కానిస్టేబుల్ నుంచి ఇతనికి వైరస్ వ్యాపించినట్టు సమాచారం. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. 
 
తెలంగాణాను వణికిస్తున్న కరోనా 
 
మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకు ఉద్ధృతమవుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,737 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 182 మంది చనిపోయారు. 
 
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,352 కాగా, ఇంకా 2,203 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 179 మందికి కరోనా సోకింది. 
 
సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇక, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు