ఆపదమ్రొక్కులవాడా, అనాథ రక్షకా, ఆదుకుంటున్నావయ్యా..

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:10 IST)
ఆపద మ్రొక్కులవాడా అనాథ రక్షకా గోవిందా... గోవిందా అంటే ఆ కలియుగ వేంకటేశ్వరస్వామి మన కష్టాలు తీరుస్తాడన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారి సాక్షాత్కారం సర్వపాపాల హరణం. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారిని దర్సించుకుంటూ ఉంటారు. 
 
అలాంటి స్వామివారిని భక్తులు రకరకాల కష్టాలతో తిరుమల కొండకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటారు. వారి సమస్య నుంచి బయట పడాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్న సమస్య అలాంటి..ఇలాంటి సమస్య కాదు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సమస్య. ఇప్పటికే కరోనాతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆసరా లేక శరణార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శరణు కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే టిటిడి ఇలాంటి సమయంలో అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారుచేసి అందిస్తోంది. ప్రతిరోజు 70 వేల మందికి ఉదయం రాత్రి వేళల్లో మరో 70 వేల మందికి ఆహార ప్యాకెట్లను అందిస్తోంది.
 
అయితే ఈ ఆహారం ఇప్పటివరకు 25 లక్షల మందికి పంపిణీ చేసింది టిటిడి. గత నెల 28వ తేదీ తిరుమలలో ఈ అన్నప్రసాద తయారీని ప్రారంభించింది. ఆ తరువాత తిరుపతిలోని క్యాంటీన్లలోనే అన్నప్రసాదాన్ని తయారుచేయడం మొదలుపెట్టారు. టిటిడి పరిపాలనా భవనం ప్రస్తుతం రెడ్ జోన్లో ఉన్నందున పూర్తిగా అన్నప్రసాద తయారీ ప్రాంతాలను మార్పు చేశారు.
 
తిరుచానూరులోని అన్నదానం క్యాంటీన్, పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మరో క్యాంటీన్, శ్రీనివాసం వసతి సముదాయంలో మూడవ క్యాంటీన్.. ఇలా మూడు క్యాంటీన్లలో ప్రతిరోజు ఒక్కో వెరైటీని తయారుచేస్తూ భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఆపద సమయంలో ఆ స్వామివారే తమను ఆదుకుంటున్నారని ఆపన్నులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు