కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి.. ఆంధ్రాలో కలకలం?!

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (13:31 IST)
దేశంలో కరోనా బాధిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ ఇప్పటికే 450కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక కరోనా మరణం కూడా సంభవించిది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కరోనా వైరస్‌ కేసుల్లో అగ్రస్థానంలో ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో కరెన్సీ నోట్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చేస్తున్నారంటూ ఓ ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటివరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ నిర్థారణకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 
 
కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్‌ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు