దేశంలో కొవిడ్‌ ఉద్ధృతికి కారణమేంటి? వైరస్‌లో మార్పులు.. వ్యాక్సినేషన్‌లో మందగమనం

ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (10:56 IST)
దేశంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఫలితంగా ఒక్క రోజులోనే 1.50 లక్షల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, భారత్‌లో ఉన్నట్టుండి కరోనా వైరస్ కేసులు పెరగడానికి గల కారణాలను వైద్య నిపుణులు వివరించారు. ప్రధానంగా.. కరోనాలో కొత్త రకాలు, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం, ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడం ఇందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. 
 
టీకా పొందినప్పటికీ జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ప్రజలకు సరిగా తెలియజేయకపోవడం కూడా ఈ విజృంభణకు దారితీసి ఉండొచ్చని చెప్పారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ రెండో ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. 
 
ముఖ్యంగా, ఉద్ధృతి తర్వాత కూడా.. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నవారు భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొదటి ఉద్ధృతి తర్వాత అనేక మందిలో అలసత్వం పెరిగింది. తాజా విజృంభణకు ఇదే ప్రధాన కారణమని వైద్య నిపుణుల్ అభిప్రాయపడుతున్నారు. 
 
‘‘కేంద్ర ప్రభుత్వం తొలుత ఈ అలసత్వానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఉదాసీనత పెరిగిపోయింది. సిబ్బంది మొత్తానికీ టీకాలు ఇవ్వకుండానే పాఠశాలలు, కళాశాలలను తెరిచారు’’ అని పేర్కొన్నారు. 
 
ఇన్‌ఫెక్షన్ల తీవ్రతకు అనుగుణంగా కఠిన నిబంధనలను విధించాల్సిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఆ సాహసం చేయలేదని చెప్పారు. మహమ్మారి దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు జాగ్రత్తగా ప్రణాళిక రచించాల్సిందన్నారు.
 
అదేసమయంలో దేశంలో ఆలస్యంగా జనవరి మూడో వారంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పైగా దానికి నిర్దిష్టంగా ఎలాంటి లక్ష్యాలను విధించలేదు.‘‘తొలుత ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇచ్చారు. కొన్నిచోట్ల అవసరం లేనప్పటికీ వాటిని వేశారు. ఫలితంగా చాలా టీకాలు వృథా అయ్యాయి. 
 
టీకా పొందాక కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అధికారులు సరిగా ప్రచారం చేయలేదన్నారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
'కొన్ని కారణాల రీత్యా.. ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా అర్హులైన కొందరు టీకాలపై విముఖత చూపారు. మార్చి మొదటినుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టినప్పటికీ 60ఏళ్లు పైబడినవారిలోనూ పలువురు వ్యాక్సిన్లపై ఆసక్తి చూపలేదు. 
 
ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. మరోపక్క దేశంలో 0.7 శాతం మంది మాత్రమే టీకాకు సంబంధించిన రెండు డోసులను తీసుకున్నారు. 5 శాతం మందికి ఒక డోసు అందింది. అందువల్లే వ్యాక్సినేషన్‌ ఫలితాలు పెద్దగా కనిపించడంలేదు' అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు