దేశంలో కరోనా వైరస్ కేసుల తాజా సమాచారం ఏంటి?

ఆదివారం, 29 నవంబరు 2020 (11:30 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతూనేవున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,810 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,92,920 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,298 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 496 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,36,696 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 88,02,267  మంది కోలుకున్నారు. 4,53,956 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
 కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,95,03,803 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులోనే 12,83,449 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 948 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,69,223కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,57,278 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,455కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 131 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 58 కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు 
కొన్ని నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో కరోనా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గత వేసవిలో తీవ్ర ఆందోళనకర రీతిలో వెల్లడైన కొత్త కేసులు, ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా వెల్లడైన బులెటిన్ లో ఈ విషయం గమనించవచ్చు. ఒక్క కృష్ణా జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రెండంకెల్లోనే కరోనా కేసులు వచ్చాయి. కృష్ణా జిల్లాల్లో 103 కొత్త కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 16, కడప జిల్లాలో 19, అనంతపురం జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 22, నెల్లూరు జిల్లాలో 24 కేసులు వచ్చాయి. 
 
తాజా అప్‌డేట్‌‌ను పరిశీలిస్తే... గడచిన 24 గంటల్లో 49,348 కరోనా టెస్టులు నిర్వహించగా 625 మందికి కరోనా నిర్ధారణ అయింది. 1,186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 5 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. 
 
అటు, మొత్తం మరణాల సంఖ్య 6,981కి పెరిగింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,67,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,48,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,571 మంది చికిత్స పొందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు