నిండు గర్భిణి...ప్రాణాలు ఫణంగా పెట్టి దేశీయ కరోనా నిర్ధారణ కిట్

ఆదివారం, 29 మార్చి 2020 (13:47 IST)
దేశంతో పాటు.. ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టింది. ఈ వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అనేక దేశాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, రోజురోజుకూ మరింతగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు విరుగుడు మందును ప్రపంచం ఇప్పటివరకు కనిపెట్టలేక పోయింది.
 
అదేసమయంలో కరోనా వైరస్ నిర్ధారణ కిట్‌లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత గురువారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఓ నిండు గర్భిణి తన ప్రాణాలను ఫణంగా పెట్టి తయారు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుణెలోని మైల్యాబ్స్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీలో పరిశోధన, అభివృది విభాగం అధిపతిగా మీనల్ దఖావే భోసాలే అనే మహిళ పని చేస్తున్నారు. ఈమె నిండు గర్భిణి. అయినా, దేశానికి సేవ చేయడమే తొలి కర్తవ్యంగా భావించారు. ఫలితంగా నాలుగు నెలల్లో జరగాల్సిన కిట్‌ అభివృద్ధి ప్రక్రియను 6 వారాల్లో పూర్తిచేశారు. 
 
ఈ నెల 18న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) పరిశీలన కోసం కిట్‌ను పంపారు. ఆ మరునాడే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మిగతా అనుమతులన్నీ లభించడంతో మైల్యాబ్స్‌కు చెందిన కరోనా కిట్‌ గత గురువారమే(మార్చి 26న) మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు