స్పెయిన్ యువరాణి కరోనాకు మృతి .. కోలుకున్న కెనడా ప్రధాని భార్య

ఆదివారం, 29 మార్చి 2020 (12:17 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ దెబ్బకు పేదోడు.. ధనికుడు అనే తారతమ్యం లేకుండా బలైపోతున్నారు. ముఖ్యంగా, 60 యేళ్లు దాటిన వృద్ధులు ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. తాజాగా స్పెయిన్ యువరాణి మారియా థెరిస్సా కన్నుమూశారు. మహమ్మారి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించడం వ‌ల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. 
 
ఆమె సోద‌రుడు ప్రిన్స్ ఎన్రిక్ డీబార్బ‌న్ త‌న ఫేస్‌బుక్ పేజీలో ఈ విష‌యాన్ని తెలిపారు. మారియా వ‌య‌సు 86 ఏళ్లు. స్పానిష్ రాయ‌ల్ ఫ్యామిలీలో మారియా స‌భ్యురాలిగా ఉన్నారు. రాచ‌కుటుంబంలో క‌రోనా వల్ల మృతిచెందిన తొలి యువ‌రాణిగా మారియా నిలిచింది. పారిస్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. అంత్య‌క్రియ‌ల‌ను మాడ్రిడ్‌లో నిర్వ‌హిచ‌నున్నారు. 
 
మరోవైపు, కరోనా దెబ్బకు కెనడా వణికిపోతోంది. ఈ దేశంలో కరోనా కేసులు 5 వేలు దాటిపోయాయి. వీరిలో 479 మంది కోలుకోగా 61 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి సోకిన వారిలో కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కూడా ఉంది. అయితే 16 రోజుల చికిత్స అనంతరం గ్రెగొరీ పూర్తిగా కోలుకున్న‌ట్లు అక్క‌డి వైద్యులు ప్రకటించారు. అటు ఇదే విష‌యాన్ని స్వ‌యంగా గ్రెగోరినే సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు.
 
కాగా సోఫి గ్రెగొరీ లండన్‌లోని ఓ కార్యక్రమానికి హాజ‌రవ్వ‌గా... స్వల్ప జ్వరం రావడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు మార్చి 12న కరోనా వైరస్‌ సోకిందని నిర్దారించారు. దీంతో ఆమె అప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో ఇంతకాలం ఇంటి నుంచే విధులు నిర్వరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు