దేశంలో ఏమాత్రం తగ్గని కరోనా వేగం : కొత్తగా 31 వేల కేసులు

గురువారం, 10 డిశెంబరు 2020 (10:30 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 31 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 31,522 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇక గత 24 గంటల్లో 37,725 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 412 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,41,772కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,53,306 మంది కోలుకున్నారు. 3,72,293 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,07,59,726  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,22,959 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 643 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 805 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,75,904కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,66,925 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,482కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,497 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,434 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 109, రంగారెడ్డి జిల్లాలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు