కోవిడ్ 19 కొత్త వేరియంట్ విషయం.. ఏపీ సర్కార్ తాజా మార్గదర్శకాలు జారీ

గురువారం, 24 డిశెంబరు 2020 (12:06 IST)
బ్రిటన్లో బయట పడిన కోవిడ్ 19 కొత్త వేరియంట్ విషయంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రకటన జారీ చేసింది.

సార్స్ కొవ్ 2 కొత్త వేరియంట్ ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికులు రాకపోకలపై దృష్టి పెట్టనుంది జగన్ సర్కార్.

బ్రిటన్ సహా విదేశాల నుంచి కరోనా వైరస్ కొత్త వేరియంట్ వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల మేరకు జగన్ సర్కార్ అలెర్ట్ అయింది. ప్రత్యేకించి విదేశీ ప్రయాణికులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.

బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా ,ఇటలీ తదితర దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వారి ట్రావెల్ హిస్టరీపై ఆరా తీయాల్సిందిగా అధికారులను ఆదేశించింది ఏపీ సర్కార్.

యూకే సహా ఇతర విదేశీ విమానాల్లో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. ప్రత్యేకించి విమానాశ్రయాల్లోనే వీరికి పరీక్షలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు ఇతర వైద్య అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

అదే సమయంలో విమానాశ్రయాల్లో వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది కోసం పిపిఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచాలని సూచనలు జారీ చేసింది ప్రభుత్వం.

ఈ క్రమంలో నెల్లూరు, అనంతపురం, కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచించింది సర్కార్.

ఈ మేరకు పొరుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ప్రత్యేకించి పొరుగు రాష్ట్రాలు వచ్చేటువంటి ప్రయాణికుల విషయంలో దృష్టి పెట్టాలని సూచించింది ప్రభుత్వం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు