ద్యావుడా, చిత్తూరు జిల్లాలో 17మంది ఉపాధ్యాయులు, 10మంది విద్యార్ధులకు కోవిడ్

బుధవారం, 25 ఆగస్టు 2021 (20:29 IST)
పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇక పిల్లలు బాగా చదువుకుంటారులే అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే కరోనా విజృంభిస్తోంది. పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఒకరిద్దరు కూడా కాదు... ఏకంగా 17మంది ఉపాధ్యాయులు, 10మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది.
 
పాఠశాలలు ప్రారంభమైన 16వ తేదీ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు, 17వ తేదీన ఒకరికి, 19వ తేదీన ఆరుగురికి, 21వ తేదీన ముగ్గురు ఉపాధ్యాయులకు, అలాగే ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ నిర్థారణ అయ్యింది.
 
23వ తేదీన ముగ్గురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థులకు, 24వ తేదీన ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. 
 
పాఠశాలల్లో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. దీంతో హాజరు శాతం గణనీయంగా పడిపోతోంది. 
 
అయితే ఇప్పటికే విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన చేశారు. పాఠశాలల్లో కరోనా సోకితే ఆ పాఠశాలలను తిరిగి తెరవవద్దని ఆదేశించినట్లు చెప్పారు. ఇలా అయితే కేసుల సంఖ్య రానురాను మరింత పెరిగే అవకాశం ఉండడంతో అటు తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెరిగి విద్యార్థులను పాఠశాలలకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు